భార్య స్మృతులు మరువలేక.. సమాధి పక్కనే భర్త ఆత్మహత్య

భార్య స్మృతులు మరువలేక.. సమాధి పక్కనే భర్త ఆత్మహత్య

స్టేషన్ ఘన్పూర్, ముద్ర: మూడు ముళ్ళు వేయించుకొని, తనతో ఏడడుగులు నడిచిన ఇల్లాలు అనారోగ్యంతో మృతి చెందగా ఆమె స్మృతులను మరువలేని భర్త సమాధి పక్కనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... కేంద్రానికి చెందిన తాటి రాజు(40) రైల్వే ఉద్యోగి. 20 ఏళ్ల క్రిందట జ్యోతి అనే మహిళతో వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితంలో ఓ కుమారునికి జన్మనిచ్చారు. వారి సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో భార్య జ్యోతి అనారోగ్యం పాలయింది. ఆస్పత్రులు ఎన్ని తిరిగిన జబ్బు నయం కాక మూడు నెలల క్రిందట ఆమె మృతి చెందింది.

భార్య మృతిని జీర్ణించుకోలేని రాజును ఆమె స్మృతుల నుండి బయటపడేoదుకు ఇరుగుపొరుగు వారు మరో పెళ్లికి ప్రోత్సహించారు. బంధువులు, ఇరుగుపొరుగు వారి ఒత్తిడి మేరకు రెండు నెలల క్రిందట మరో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య జ్యోతి స్మృతుల నుండి రాజు బయటపడలేకపోయాడు. సోమవారం రోజంతా ఇంటి వద్ద  అందరితో సంతోషంగా గడిపిన రాజు ఆ సాయంత్రం నుండి ఎవరికి కనిపించలేదు. మంగళవారం ఉదయం మొదటి భార్య జ్యోతి సమాధి ప్రక్కన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాఘవేందర్ తెలిపారు.