తెలంగాణకు జపాన్ కంపెనీలు
![తెలంగాణకు జపాన్ కంపెనీలు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b23b03ee96f.jpg)
- చందనవెల్లిలో శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- ‘డైఫుకు, నికోమాక్ తైకిషా’ కంపెనీల ఏర్పాటు
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్ లో జపాన్ కి చెందిన మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయని అన్నారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్ తిరిగి నిలబడి సత్తా చాటిందన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్ కు చెందిన ‘డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్’ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ తమ యూనిట్ ల ఏర్పాటుకు తెలంగాణను ఎంపిక చేసుకోవడం సంతోషకరమని చెప్పారు. మన దేశంలోని ప్రతి ఇంటిలో జపాన్ కి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్ లో జపాన్ కి చెందిన మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.
వనరుల సద్వినియోగం
జపాన్ లో వనరులు తక్కువగా ఉంటాయని, వాటినే సద్వినియోగం చేసుకుంటూ ఆ దేశం అభివృద్ధి చెందుతున్నదని కేటీఆర్ అన్నారు. రూ.575 కోట్లు పెట్టుబడి పెడుతున్న ‘డైఫుకు’ మూడు నెలల్లోనే ఇక్కడ యూనిట్ ప్రారంభిస్తుందన్నారు. భారత్ కు చెందిన ‘వెగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్’ కంపెనీతో కలసి ‘డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ కంపెనీ’ ఎక్విప్ మెంట్ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. కన్వేయర్స్ను, షార్టర్స్ ను ఉత్పత్తి చేస్తారు. 500 మందికి ఉపాధి లభిస్తుంది. ‘నికోమాక్ తైకిషా లిమిటెడ్’ కంపెనీ నిర్మాణ రంగానికి చెందిన క్లీన్ రూం ఉత్పత్తులను తయారు చేస్తుంది. చందన్ వెల్లిలో రూ.126.2 కోట్లతో యూనిట్ నెలకొల్పుతోంది. నిరుడు డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని మంత్రి వివరించారు. చందన్ వెల్లి ఇండస్ట్రియల్ పార్క్ కు వెల్ స్పన్, మైక్రోసాఫ్ట్ సహా అనేక ఇతర సంస్థలు వస్తున్నాయని చెప్పారు అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథరెడ్డి, షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి, నాయకులు పి. కార్తీక్ రెడ్డి, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.