ఆగస్టు 3న కోకాపేటలో భూముల వేలం
- నోటిఫికేషన్జారీ చేసిన హెచ్ఎండీఏ
- 45.33 ఎకరాల అమ్మకం
- ప్రభుత్వానికి 2 వేల కోట్ల ఆదాయం?
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : కోకాపేటలో రెండో విడత భూముల వేలానికి హెచ్ఎండీఏ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోకాపేటలోని నియోపొలిస్ లే అవుట్లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 7 ప్లాట్లను ఈ వేలంద్వారా విక్రయిస్తామని ప్రకటించింది. 3.9 నుంచి 9.1 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలం ఆగస్టు 3న జరగనుంది. కంపెనీలు, ట్రస్టులు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్, సెమీ పబ్లిక్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, జాయింట్ వెంచర్ పెట్టుబడిదారులు ఈ ప్లాట్ల కొనుగోలుకు అర్హులు. జూలై 20న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ వెబ్సైట్ లో జూలై 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందస్తు డిపాజిట్ కింద ఆగస్టు 1లోగా ప్రతీ ప్లాటుకు రూ.5 కోట్లు చెల్లించాలి. ఆగస్టు 3న ఉదయం, మధ్యాహ్నం 2 విడతల్లో ఈ వేలం జరుగుతుంది. ఎకరానికి కనీస అప్సెట్ ధర రూ.35 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు బిడ్ పెంపుదలకు కనీసం రూ.25 లక్షలు ధరను పెంచాలని సూచించారు.
తొలి విడతలో 2వేల కోట్ల ఆదాయం..
ఏడాది క్రితం కోకాపేటలో తొలివిడతగా 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు రెండో విడత విక్రయాల ద్వారా కూడా అంతే మొత్తంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిజానికి, నియో పొలిస్తోపాటు గోల్డెన్ మైల్ పేరుతో అభివృద్ధి చేసిన లే ఔట్లలో భూములు కొనుగోలుకు గతేడాది చాలా సంస్థలు పోటీ పడ్డాయి. అత్యధికంగా రూ.60 కోట్లదాకా చెల్లించి ఎకరం భూమిని కొనుగోలు చేశాయి. ఏడాది క్రితం ఈ లేఔట్లలో ఎకరం భూమి సగటున రూ.40 కోట్లకు అమ్ముడైంది. ఈ భూములు కొనుగోలు చేసిన సంస్థలు విలాసవంతమైన భారీ భవనాల నిర్మాణం చేపట్టాయి. అయితే కోకాపేటను అనుకొని ఉన్న ప్రాంతమంతా 111 జీఓ పరిధి కావడం, అక్కడ ఆంక్షలు తొలగనుండటం రెండో విడత ఈవేలంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.