హరగోపాల్పై దేశద్రోహం కేసు
- మొత్తం 152 మందిపై నమోదు
- మావోయిస్టు నేత పుల్లూరి ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్లాన్
- ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న ప్రొఫెసర్ హరగోపాల్
- కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలోనే కేసులు బయటకు వస్తున్నాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో: పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్పై దేశద్రోహం కేసు నమోదైంది. నిరుడు ఆగస్టులోనే ఈ కేసు నమోదు చేశారు. మొత్తం 152 మందిపై ఉపా, ఆర్మ్స్యాక్ట్తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా మావోయిస్టు పార్టీ పాఠ్యపుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో మొత్తం 152 మందిపై పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. Unlawful Activities Prevention Act (UPA) చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హరగోపాల్తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చారు. తాజాగా ఈ విషయం బయట పడింది. ఇప్పటి వరకు దీన్ని పోలీసులు ఎక్కడా తేల్చలేదు. తాజాగా People's Democratic Movement (PDM) పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కానీ, అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయని, బెయిల్పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను ప్రస్తావించారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ (జస్టిస్ సురేశ్ ఎఫ్ఐఆర్ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లున్నాయి.
ఇలా మొత్తం 152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చింది. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బీరెల్లి గ్రామం వద్ద అదే రోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారని, పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని, అక్కడ పోలీసులు తనిఖీలు చేసి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చామని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హత్య చేయడానికి వీరంతా మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ ప్లాన్ జరిగిందని వెల్లడించారు. కాగా, ఈ కేసు నమోదైన వారిలో కొంతమంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాగా, విద్యా మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బయటకు తీయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్యానికి విరుద్ధం
దేశద్రోహం కేసుపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ తమలాంటి వారిపై ఆదారపడదని, వాళ్ల మార్గం వేరన్నారు. మావోయిస్టు పుస్తకాల్లో తన పేరు ప్రస్తావనకువ స్తే తనకేం సంబంధం అని, రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కేసులు బయటకు తీయడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని, తనతో పాటుగా మొత్తం 152 మంది కేసు పెట్టడం విషాదకరమన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇది వ్యవస్థలో ఉండాల్సిన చట్టం కాదని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లని, ఇప్పటికైనా తప్పు అయిందని ఒప్పుకోవాలని, అందరిపై కేసులు ఎత్తివేయాలన్నారు.
ఉపా చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగాలని కోరారు. అందరం కలిసి మట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజా సంఘాలకు సూచించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అక్రమ కేసు ఒక ఉదహరణ అని అన్నారు. 2022లో ఈ కేసు నమోదైందని, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందో తెలియదన్నారు. కేసీఆర్ప్రభుత్వంపై విమర్శలు, పాలనాతీరును ప్రశ్నిస్తున్ననేపథ్యంలోనే దేశద్రోహం కేసులు బయటకు వచ్చాయని, హరగోపాల్తో పాటుగా పలువురు మేధావులపై ఏఏ కేసులు ఉన్నాయో బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఈ క్రమంలో కేసు బయటకు వచ్చిందని అనుమానాలు వ్యక్తం చేశారు.