ప్రశ్న పత్రం లీకేజీ నిందితుడి ఫోన్లో మహిళల నగ్న దృశ్యాలు
![ప్రశ్న పత్రం లీకేజీ నిందితుడి ఫోన్లో మహిళల నగ్న దృశ్యాలు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64101d074beee.jpg)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే లీకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్ విభాగానికి వచ్చే మహిళల చరవాణి నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పలువురు మహిళలతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్ఫోన్లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. నిందితుడు ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి పేపర్లు కొనుగోలు చేసినట్టు సమాచారమున్న మరో నలుగురు అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు.