బిసిలకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలి - ఆర్. కృష్ణయ్య

బిసిలకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలి - ఆర్. కృష్ణయ్య

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రములో జానాభా ప్రాతిపదికన బిసిలకు ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. క్ర్రష్ణయ్య అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధినగర్ లో డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ కి పోటీ చేసే అభ్యర్థుల జాబితా లో బిసిలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. 10% జనాభా వున్న అగ్రకులాలకు 60 టిక్కెట్ లు ఇవ్వడంతో సిఎం కెసిఆర్ బిసిలకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బిసిలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలలో బిసిలకు అవకాశం రాకుండా అగ్రకులాల నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రములో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే బిసి అభ్యర్థులకు మద్దతుగా పెద్దఎత్తున ప్రచారం చేస్తామని అన్నారు. ప్రతి నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కార్యకర్తల బలం, ఆర్దిక వనరులు, ప్రజల మద్దతు వున్న బిసి నాయకులు వున్నారని అన్నారు. బిసి నాయకులకు ప్రధాన రాజకీయ పార్టీలు టిక్కెట్ లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి చోటా బిసిలలో చైతన్యం వచ్చిందని, బిసిలు ఆత్మగౌరవ పోరాటానికి సిద్దమవుతున్నారని అన్నారు. బిసిలను నిర్లక్ష్యం చేస్తున్న పార్టీల నాయకులను బయట తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇంకా ఎన్నాళ్లు బిసిలను అణగదొక్కుతారని, బిసిలపట్ల వివక్ష చూపుతారని ప్రశ్నించారు. భారతమాత ముద్దుబిడ్డలైన బిసిలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో , కార్పరేట్ సంస్థలలో ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుందని అన్నారు. త్వరలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిసిల ఐక్యతను చాటుతూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసి సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.