తుది అంకానికి చేరిన రాజశ్యామల యాగం

తుది అంకానికి చేరిన రాజశ్యామల యాగం

హైదరాబాద్: ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన రాజశ్యామల యాగం తుది అంకానికి చేరుకుంది. యాగశాలలో ఆఖరి రోజు రాజశ్యామల అమ్మవారు నర్తన కాళి అవతారంలో దర్శనమిచ్చారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. పూర్ణాహుతి ముహూర్త సమయానికి రాజశ్యామల అమ్మవారి మంత్రాలను మూడు లక్షల సార్లు హవనం అయ్యేలా పండితులతో చర్చించారు. కుంభోద్వాసన చేసిన అనంతరం యాగంలో మంత్రించిన జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులపై చల్లుతారు. అలాగే యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దుతారు. యాగం ప్రారంభానికి ముందు కేసీఆర్‌ దంపతులు ధరించిన కంకణాలను యాగశాలలో కంకణ విసర్జన ద్వారా పీఠాధిపతులకు అందిస్తారు. దీంతో రాజశ్యామల యాగం పరిసమాప్తం అవుతుంది. వేద పండితులు మహదాశీర్వచనం అందించిన తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్‌ పాదపూజ చేస్తారు. విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి రప్పించిన రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను సీఎం దంపతులకు అందిస్తారు. శుభసూచికంగా పండితులంతా పసుపు వస్త్రాలను ధరించి యాగశాలకు హాజరయ్యారు