దేశంలోనే సత్తాచాటిన సిద్దిపేట ఆడబిడ్డ
- దేశంలోనే సత్తాచాటిన సిద్దిపేట ఆడబిడ్డ
- జాతీయ స్థాయిలో మెరిసిన సిద్దిపేట విద్యార్తి వెన్నెల
- ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ పీహెచ్డీ పరీక్షలో బక్రిచెప్యాల అమ్మాయి పురుమాండ్ల వెన్నెలకు జాతీయ స్థాయి మొదటి ర్యాంకు
- ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ యూనివర్సిటీకి ఎంపిక
- ప్రత్యేకంగా అభినందించిన మంత్రి హరీశ్రావు
ముద్ర ప్రతినిధి :సిద్దిపేట : అన్ని రంగాల్లోనూ రోల్మాడల్గా మారిన సిద్దిపేట నియోజకవర్గ కీర్తి మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాలకు చెందిన పురుమాండ్ల వెన్నెలకు అడవులపై పరిశోధన చేసే అరుదైన అవకాశం దక్కింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్లో గల ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యనభ్యసించడానికి గత మే నెల 28న అర్హత పరీక్షలు నిర్వహించారు. ఇందులో పీహెచ్డీ సీటు దక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు.కానీ జాతీయ స్థాయిలో వెన్నెలకు మొదటి స్థానం దక్కింది. వెన్నెల జిల్లా వెటర్నరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పురుమాండ్ల కొండాల్రెడ్డి-రేవతిల తొలి సంతానం. మిగితా ఇద్దరు అమ్మాయిలను చదువులో ప్రొత్సహిస్తున్నారు. కాగా పదో తరగతి వరకు సిద్దిపేటలోని తులిప్ స్కూల్లో చదివిన వెన్నెల, హైదరాబాద్లోఇంటర్ చదివింది. ములుగులోని ఫారెస్టు కళాశాలలో బీఎస్సీ ఫారెస్టు,ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో గల బెనారస్ హిందూ యూనివర్సిటీలో అగ్రో ఫారెస్టు పీజీ విద్యనభ్యసించింది. ఆనాడు పీజీ అర్హత పరీక్షలోనూ జాతీయ స్థాయిలో 9వ రాంక్ సాధించింది.తాజాగా పీహెచ్డీ మొదటి ర్యాంకుతో మూడేళ్లపాటు రాయపూర్లో అడవులపై పరిశోధన నిర్వహించడానికి సిద్దమైంది.
సిద్దిపేట గర్వపడేలా మొదటిర్యాంకు
విద్యార్తిని అభినందించిన మంత్రి హరీశ్రావు
మన సిద్దిపేట ప్రాంతం గర్వపడేలా పురుమాండ్ల వెన్నెల జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు పొందడం నిజంగా చాలా సంతోషమైన విషయం.ఎంతోమంది విద్యార్థులకు వెన్నెల స్పూర్థిగా నిలిచింది. భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడమే గాకుండా ఆ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నది.మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్ల నెలకొల్పిన ములుగు ఫారెస్టు కాలేజీలో బీఎస్సీ చదివి ఆ తర్వాత బెనారస్ యూనివర్సిటీలో పీజీ, ఇప్పుడు రాయపూర్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేయడమంటే అసాధారణమైన ప్రతిభతో వెన్నెల శ్రమించడమే ఇందుకు కారణం.వెన్నెలకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.