పల్లె ప్రగతితో మారిన గ్రామాల స్వరూపం- కలెక్టర్ రాజర్షి షా

పల్లె ప్రగతితో మారిన గ్రామాల స్వరూపం- కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా నేడు  గ్రామాల స్వరూపాలే మారిపోయాయని, పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం టేక్మాల్ మండలం ఎల్లుపేట్ గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో  స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మండల ప్రత్యేకాధికారి  జెంలా నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి  ర్యాలీగా బయలు దేరి పాఠాశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ సర్పంచు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామంలో ఏఏ కార్యక్రమాలు చేశారో తెలుసా అని వాకబు చేశారు. పల్లెలు ప్రగతికి చిహ్నాలని,  పచ్చదనం పరిశుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తలంపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామ పంచాయతీకి టంచనుగా ప్రతి నెల ఆర్ధిక సంఘం నిధులు అందజేస్తున్నారన్నారు. డంప్ యార్డులు, సేగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వన్నెలు, తెలంగాణాకు క్రీడా  ప్రాంగణాలు ఏర్పాటు  చేశారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్,ట్రాలీ,డోజర్ వంటివి అందించి పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా చేశారని, హరితాహారం క్రింద రోడ్డు కిరువైపుల, పబ్లిక్ సంస్థలలో విరివిగా మొక్కలు పెట్టి పచ్చదనానికి కృషిచేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు పట్టణాలకు వలసలువెళ్లిన వారు నేడు పల్లెల వైపు చూస్తున్నారని ఇదంతా పల్లె ప్రగతి ద్వారా సాధ్యమైందని అన్నారు. 

అనంతరం గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ సాయిలు జెండా ఎగుర వేశారు. ఈ సంధర్భంగా    9 ఏళ్ళలో   గ్రామంలో వివిధ పధకాల  ద్వారా  సాధించిన ప్రగతి, అమలు జరుగుచున్న కార్యక్రమాలు, వచ్చిన నిధులు, లబ్డిపొందిన వివరాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలోని 469 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.   కేసిఆర్  కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్,  రైతు బందు వంటి ఎన్నో పధకాల ద్వారా గ్రామ వాసులు లబ్ది పొందారని, త్వరలో ఆగిపోయిన మరికొందరికి ఆసరా పింఛన్లు అందించు టకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.   

ఈ కార్యక్రమంలో ఎంపిపి చింత స్వప్న, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.