మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి సీనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రజిని
ముద్ర ప్రతినిధి, వనపర్తి : సమాజంలో మహిళల కోసం ఎన్నో వసతులు, చట్టాలు సమకూర్చడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి సీనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రజిని అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సును కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి ఈ అవకాశాలను మహిళలు అందిపుచ్చు కోవాలని సూచించారు. వరకట్న నిషేధం ఫోక్సో , గృహహింస నిరోధక చట్టం, ఆస్తిలో సమానహక్కు తదితర ప్రత్యేక చట్టాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉచిత న్యాయ సలహాలు పొందే అవకాశం కూడా ఉంటుందని ఆమె వివరించారు. ఈ సందర్భంగా రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జానకి, కృష్ణ చైతన్య, సిడిపిఓ లక్ష్మమ్మ, వనజ కుమారి, నలిని, విజయకుమార్వి, విష్ణు, పుష్పలత, జయలక్ష్మి, అంగన్వాడి టీచర్లు కవిత, తదితరులు పాల్గొన్నారు.