రేవంత్, బండి సంజయ్‌లకు వైఎస్ షర్మిల ఫోన్

రేవంత్, బండి సంజయ్‌లకు వైఎస్ షర్మిల ఫోన్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు.. అధికార బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం  చేద్దామని చెప్పారు. అలాగే ప్రగతి భవన్ మార్చ్ కు  పిలుపు నిద్దామని సూచించారు.  సీఎం కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడని కూడా  అన్నారు.  ఈ విషయంపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపినట్టుగా సమాచారం. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని.. త్వరలో సమావేశం అవుదామని చెప్పినట్టుగా తెలిసింది.   మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని కూడా షర్మిలతో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తెలుపుతామని ఆయన పేర్కొన్నట్టుగా  తెలిసింది.