ఏప్రిల్ 14న వైభవోపేతంగా 125 అడగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

ఏప్రిల్ 14న వైభవోపేతంగా 125 అడగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
  • రెండవ విడత గొర్రెల పంపిణీ కి అధికారులు సన్నద్దం కావాలి...
  • గొర్రెల పంపిణీపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
  • స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల తరలింపు చేయాలి
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్ జయంతి వేడుకలపై  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ తో కలిసి వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో నిర్మించిన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, దీనిని విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యెలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల కేంద్రం నుంచి బస్సులు నడపాలని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి తప్పనిసరిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్ కు ప్రజలు చేరుకునే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు ఆ రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో పోలీస్ అధికారి, ప్రభుత్వ అధికారినీ నియమించి బాధ్యతలు అప్పగించాలని, బస్సు తిరిగి మండల కేంద్రాలకు చేరే వరకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయాలని  పేర్కొన్నారు. 

రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని, దానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో పూర్తి చేయాలని అన్నారు. రెండవ విడత క్రింద ఎంపిక చేసిన 3.38 లక్షల లబ్దిదారులలో మరణించిన వారి నామిని వివరాలు సేకరించి వారికి గొర్రెల యునిట్లను పంపిణి చేయాలని అన్నారు. ప్రతి మండల పరిధిలోని లబ్దిదారులతో రెండవ విడత గొర్రెల పంపిణీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్దిదారున్ని వాటా సేకరించాలని, గొర్రెల కోనుగోలు కోసం వెళ్ళెందుకు సినియర్ అధికారినీ నియ మించాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు గొర్రెల పంపిణీ, అంబేద్కర్ జయంతి పై పలు సూచనలు చేశారు. జిల్లాలో గొర్రెల పంపిణీ రెండవ విడత సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ కొమురయ్య కు సూచించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజల తరలింపు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పాల్గోనే ప్రజల వివరాలు సేకరించాలని, ప్రతి మండల పరిధిలో వెళ్ళె బస్సులో అవసరమైన స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రావు కు సూచించారు.

ప్రతి మండల కేంద్రం నుండి ఉదయం 8గంటల వరకు బస్సులు హైదరాబాద్ కు బయలు దేరే లా చర్యలు తీసుకోవాలని, ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. జనరల్ అడ్మినిస్త్రేషన్ నుండి ఇద్దరు, పోలీస్ శాఖ నుండి ఒక్కరూ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో అర్ డి ఓలు  టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గౌతమ్ రెడ్డి, శ్రీధర్, జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రావు,  ఐ డి ఏం మల్లిఖార్జున్,, మున్సిపల్ కమిషనర్ లు సమ్మయ్య,అన్వేష్,  ఏ ఓ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.