విజయవంతమైన తెలంగాణ రన్

విజయవంతమైన తెలంగాణ రన్

 పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి
 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : దశబ్ది ఉత్సవాలలో భాగంగా "తెలంగాణ రన్” కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు శాఖ, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "తెలంగాణ రన్" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఏకో పార్కు వరకు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా శారీరక వ్యాయామం చేయడం ద్వారా శారీరక రుగ్మతలు తొలగిపోయి, ఆరోగ్యవంతమైన జీవితము సొంతమవుతుందన్నారు. యోగ, ధ్యానం, ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, మంచి జ్ఞాపకక్తి పెరుగుతుందన్నారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఉదయం నడకకు వచ్చే వారికి ఉపయుక్తంగ ఉంటుందన్నారు.

    “ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా సఖి సెంటర్ ఆధ్వర్యంలో ఎకో పార్కు వద్ద చిన్నారులతో మానవహారం ఏర్పాటు చేసి, మంత్రి చేతుల మీదుగా పోస్టర్లను విడుదల చేసినట్లు తెలిపారు.  ఈ రన్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, సఖి నిర్వహకురాలు చెన్నమ్మ తామస్, చంద్రశేఖర్, క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం “ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా వనపర్తి పట్టణంలోని హిందీ బిఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సఖి కేంద్రం సభ్యులతో ప్రతిజ్ఞ నిర్వహించి, "పని వద్దు - చదువు ముద్దు" గోడ పత్రికలను ఆయన విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులను పనులలో పెట్టుకోరాదని, వారు విద్య అభ్యసించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. సఖి కేంద్రం ద్వారా ఎంతో మందికి ఆదరణ కల్పిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సఖి నిర్వహకురాలు చిన్నమ్మ తమస్, సి డబ్ల్యూ.సి. చైర్మన్ అలివేలమ్మ, రాంబాబు, లక్ష్మి, సౌజన్య, శ్రీలక్ష్మి, సఖి కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.