అరుణ్ రామచంద్రపిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ
![అరుణ్ రామచంద్రపిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64183c0f532ae.jpg)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు అరుణ్ రామచంద్రపిళ్లైని సోమవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ ఏడాది ఏప్రిల్ మూడో తేదీ వరకు అరుణ్ రామచంద్రపిళ్లైకి జ్యూడీషీయల్ రిమాండ్ ను విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారణ చేసినట్టుగా సమాచారం. కవితను అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి విచారించాల్సి ఉందని ఈ నెల 16న కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు.
ఇతరులతో కలిపి విచారణ విషయమై కోర్టు ఈడీ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నేరుగా ప్రశ్నించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావడం కోసం కొందరిని కలిపి విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. దీంతో అరుణ్ రామచంద్రపిళ్లైకి ఈడీ కస్టడీని పొడిగించింది కోర్టు. ఇవాళ మధ్యాహ్న భోజనం వరకు అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిపి కవిత ను ఈడీ అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనం తర్వాత అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. అరుణ్ రామచంద్రపిళ్లైకి జ్యూడీషీయల్ రిమాండ్ ను ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.