నాంధేడ్‌ సభకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు

నాంధేడ్‌ సభకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు

సంక్రాంతి తర్వాత బీఆర్‌ఎస్‌ యాక్టివిటీ పెంచుతామన్న కేసీఆర్‌ ప్రకటనకు అనుగుణంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. మొన్న ఖమ్మంలో సభ, నిన్న ఒడిశా నేతల చేరిక, ఫిబ్రవరిలో మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గులాబీ దళం కసరత్తులు చేస్తోంది.

నాందేద్‌లో వచ్చే నెల 5వ తేదీన సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే రెండో బహిరంగ సభ వేదికకు పార్టీ నేతలు పూజలు నిర్వహించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బిబి పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, హనుమంత్‌ షిండే, జోగు రామన్న, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, నాందేడ్‌ ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ దేశంలోనే ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, అభివృద్ధి దిశగా మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.

నాందేడ్‌ సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకోబోతున్నారని బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి, బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసి పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్‌.ఈ క్రమంలో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావిత ప్రాంతాలను టార్గెట్‌ చేశారు. తాము ఫోకస్‌ పెడితే కలిసి వస్తుందనుకున్న చోట్ల సభ నిర్వహించి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభ నిర్వహించబోతున్నారు.