గూడూరు కుటుంబ సభ్యుల ఇంటింటి ప్రచారం

గూడూరు కుటుంబ సభ్యుల ఇంటింటి ప్రచారం

 ముద్రప్రతినిధి, బీబీనగర్: భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డిని గెలిపిస్తే, నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన కుటుంభ సభ్యులు, ఆ పార్టీ నేతలు ఓటర్లకు వివరించారు. బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో వారంతా ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నారాయణ రెడ్డి తన సొంత నిధులతో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయిస్తారని, మూసీ నది ప్రక్షాళన చేస్తారని, దుద్రవల్లి, సంగెం, ఇంద్రియాల బ్రిడ్జిలను నిర్మిస్తారని వారు వివరించారు.

ఇప్పటికే గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఉచిత కోచింగ్ ఇప్పించడం ద్వారా 79 మంది యువకులు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యేలా చూశారని వారు తెలిపారు. గూడూరు ఉపసర్పంచి గూడూరు రేణుక నరోత్తమ్ రెడ్డి, గూడూరు ఉమ, డాక్టర్ గూడూరు స్రవంతి, లక్ష్మీ కళ్యాణి, స్ఫూర్తిరెడ్డి తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని గ్రామస్థులను అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్, మహేష్, సత్యనారాయణ రెడ్డిలతో పాటు పలువురు మహిళలు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.