ప్రతి ఇంటికి తాగునీరు..  ప్రతి పంటకు సాగునీరు..

ప్రతి ఇంటికి తాగునీరు..  ప్రతి పంటకు సాగునీరు..
  • కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
  • ఘనంగా సుపరిపాలన దినోత్సవం

ముద్ర ప్రతినిధి, జనగామ: ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న జనగామకు తాగు, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అధ్యక్షతన సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ గార్డెన్ లో జరిగిన ఈ వేడుకలకు కడియంతో పాటు జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, డీసీపీ సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా  కడియం మాట్లాడుతూ తెలంగాణ రాక ముందుకు జనగామలో కరువు విలయతాండవం చేసేదని, తాగు, సాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడేవాళ్ళమని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి గుంటకు సాగునీరు అందుతోందన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా భూగర్భజలాలు పెరిగి వ్యవసాయం లాభాల దిశగా పయనిస్తోందన్నారు. దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులంతా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి పౌరునికి సంక్షేమ ఫలాలు అందే విధంగా పనిచేయాలన్నారు. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి ఎవరి స్థాయిలో వారు సమస్యను పరిష్కరించాలన్నారు.

కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం సులభతరం అయిందన్నారు. త్వరితగతిన ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని, జిల్లాలో నూతన కలెక్టరేట్ల భవనాల నిర్మాణం, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సుపరిపాలన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన విధానం ద్వారా ప్రభుత్వ శాఖలు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయని చెప్పారు. మన పాలనను మెచ్చి కేంద్రం కూడా అనేక జాతీయ స్థాయి అవార్డులు తెలంగాణకు ఇచ్చిందని గుర్తుచేశారు. జనగామ జిల్లాకు వచ్చిన అవార్డుల్లో ఉద్యోగులు కీలక పాత్ర వహించారన్నారు.

అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, పేరిణి సంతోష్ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్ సింగ్, వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, డి ఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, స్టేషన్ ఘన్ పూర్ మార్కెట్ చైర్మన్ రాజు, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధి లింగం, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.