ఎనిమిది మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ టీడీపీ డిమాండ్లు

ఎనిమిది మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ టీడీపీ డిమాండ్లు

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతఈత్వంలో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్ డిఎ) తమ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఎనిమిది మంత్రి పదవులను తమకు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

ఎన్ డిఏ కూటమి నాయకుడిగా నరేంద్ర మోడీ పేరును ఏకగ్రీవంగా అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి ఎన్నుకున్నాయి. తమ ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతిని శుక్రవారం కలిసి బీజేపీ, మిత్రపక్షాలు శుక్రవారం క్లెయిమ్ చేయనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం (టీడీపీ), జనతా దళ్ యునైటెడ్ (జేడీ –యూ) ఎన్డీయేలోని బీజేపీయేతర సభ్యులలో సింహభాగం మంత్రిపదవులను కోరుతున్నాయి.

     బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడంతో, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు 16 మరియు 12 సీట్లు తప్పనిసరి కావడంతో నారా చంద్రబాబు నాయుడుకు చెందిన టిడిపి, నితీష్ కుమార్ కు చెందిన జెడి (యు) కింగ్‌మేకర్‌లుగా అవతరించాయి. దీంతో వీరు ముఖ్యంగా పలు పోస్టులను డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. ఎన్డీయేకు ఉన్న 292 సీట్లలో బీజేపీకి 240, టీడీపీకి 16, జేడీ (యూ)కి 12, శివసేనకు 7, లోక్ జనశక్తి పార్టీ-రాంవిలాస్ (ఎల్జేపీ-రాంవిలాస్)కి 5 సీట్లు ఉన్నాయి. జనసేనకు 2, ఇతర పార్టీలకు కలిపి మరో పది సీట్లు వున్నాయి.

    ఆరోగ్య, ఐటీ, విద్యా మంత్రిత్వ శాఖలతో పాటు మొత్తం ఎనిమిది మంత్రి పదవులు కావాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్డు రవాణా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఆరోగ్యం, విద్య, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ గా తెలుస్తోంది. అలాగే వీటితో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని, రాష్ట్ర రాజధానిగా అమరావతి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కూడా టీడీపీ డిమాండ్ చేసిందని సమాచారం.

ఇక జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) కూడా మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తోంది. జేడీయూ డిమాండ్లలో రైల్వేలు, వ్యవసాయం, పరిశ్రమలు మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అంతేకాకుండా, ఎన్‌డిఎ ప్రభుత్వానికి కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలని జెడి (యు) కూడా డిమాండ్ చేసింది.