పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి:  జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి:  జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక నాథ్ రెడ్డి సూచించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన "హరితోత్సవం" కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ ప్రకృతి వనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్.పి. చైర్మన్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా స్వచమైన గాలి అందుతుందని, ప్రజలు కాలుష్యం బారిన పడకుండా నివారించవచ్చునని ఆయన తెలిపారు. ఉదయపు నడక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమన్నారు. ప్రతి ఒక్కరూ హరిత హారం కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని ఆయన అన్నారు. 

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 9వ. విడత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అటవీ విస్తీర్ణం 7 నుండి 8 శాతం అభివృద్ధి చెందినట్లు ఆయన తెలిపారు. మొక్కలు పెంచడం ద్వారా స్వచమైన గాలి మనకు లభిస్తుందని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ఆక్సిజన్ యొక్క ప్రాధాన్యత మన అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటినట్లైతే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలలో, కార్యాలయాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు. 9వ. విడత హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, డి.ఎస్.పి ఆనంద రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.