నా స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు పెట్టామనడం దిగ్భ్రాంతికరం 

నా స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు పెట్టామనడం దిగ్భ్రాంతికరం 
  •  ఏపీ ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి  పీవీ రమేశ్‌

హైదరాబాద్ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్‌ అన్నారు. ఈ కేసుపై గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తాజాగా టీడీపీ  అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదితర పరిణామాల నేపథ్యంలో పీవీ రమేశ్‌ స్పందించారు.

ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లేవీ? 

‘‘నా వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారనడం హ్యాస్యాస్పదం. నేను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తవం. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఆర్థిక శాఖ ఏ తప్పూ చేయలేదు. సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది. నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లు ఎందుకు లేవు?

అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్‌ చేయడమేంటి? 

సీఎంగా ఉండేవారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. ప్రతి బ్యాంక్‌ అకౌంట్‌లో ఏం జరుగుతుందో సీఎంకి ఏం తెలుస్తుంది? ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్‌ ఏమయ్యాయి? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫైల్స్‌ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సీఎం అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్‌ చేయించడం జరగదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై రాసిన నోట్‌ ఫైల్స్‌ ఏమయ్యాయి? తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్‌ చేయడమేంటి? అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారు?’’అని పీవీ రమేశ్‌ ప్రశ్నించారు.