31 న కొలువుదీరనున్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి

31 న కొలువుదీరనున్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి
  • ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలు అందజేసిన టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి
  • 10 ఎకరాల్లో 20 కోట్లతో ఆలయ నిర్మాణం
  • టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఈనెల 31న కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరీంనగర్ లో కొలువు తీరనున్నాడు. కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలగబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కరీంనగర్ లో 10ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు.  రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ల కృషి ఆలయ సాధనలో అభినందనీయం. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వజరీ కమిటీ చైర్మన్ భాస్కరరావు లకు అందజేసారు.

ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మే 31వ తేదీన ఉదయం 7గం. 26 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుండి ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించే విదంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ త్వరలోనే వినోద్ రావు, బాస్కర్ రావులతో కలిసి తిరుమల వెళ్లి ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్ లో నిర్మించే శ్రీవెంకటేశ్వర ఆలయం యెక్క అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాధ వితరణ కేంద్రం, తదితర అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి కరీంనగర్ తో పాటు తెలంగాణ ప్రజలకు ఆ దేవదేవుని ఆశిస్సులు అందిస్తామన్నారు.