ప్రధాని నరేంద్ర మోడీని కలిసి గురు నానక్, శ్రీనిధి సంస్థల వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిసి గురు నానక్, శ్రీనిధి సంస్థల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల దోపిడీపై మోడీకి వివరించిన్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం, 2018ని ఆమోదించి వాస్తవాలను ధృవీకరించకుండా నాణ్యతా ప్రమాణాలను చూడకుండా .గురు నానక్, శ్రీనిధి సంస్థలకు అనుమతి ఇవ్వడంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదన్నారు. 2022–23 విద్యాసంవత్సరానికి గురునానక్ లో 2,800 వరకూ, శ్రీనిధిలో 300 మంది విద్యార్థులను చేర్చుకున్నారుని చెప్పారు. విద్యాసంవత్సరం చివరి వరకూ వేచిచూసినా గవర్నర్ ఆమోదం తెలుపలేదు. దీంతో ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి రావడంతో విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు గురునానక్ వర్సిటీ వద్ద పలుమార్లు ఆందోళనలు చేశారన్నారు. ఈ విషయంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ సంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలన్నారు. ప్రధాని మోడీ అన్ని విషయాలను విని సానుకూలంగా స్పందించారని చెప్పారు.