మెదక్ పురపాలక సంఘం  రూ.20.51 కోట్ల బడ్జెట్ కు ఆమోదం

మెదక్ పురపాలక సంఘం  రూ.20.51 కోట్ల బడ్జెట్ కు ఆమోదం

హాజరైన ఎమ్మెల్యే పద్మ, కలెక్టర్ షా
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పురపాలక సంఘం 20 కోట్ల 51 లక్షల 89 వేల రూపాయలతో రూపొందించిన 2023-24 సంవత్సరపు అంచనా బడ్జెట్ ను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్  అధ్యక్షతన నిర్వహించిన 2023-24 సంవత్సరపు మునిసిపల్  బడ్జెట్ సమావేశంలో  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమీషనర్ జానకి రామ్ సాగర్ పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 27 కోట్ల 02 లక్షల నుండి 16 కోట్ల 68 లక్షల 81  వేలకు సవరించిన బడ్జెట్ కు సభ ఆమోదం తెలిపింది. ఇందులో ఆస్తిపన్ను, అసైన్డ్ రెవిన్యూ ద్వారా 6 కోట్ల 64 లక్షలు, అద్దెలు, టౌన్ ప్లానింగ్, సానిటిషస్, ఇంజనీరింగ్ తదితర  పన్నేతర వనరుల  ద్వారా 6 కోట్ల13 లక్షల 89 వేలు, డిపాజిట్లు, అడ్వాన్స్ ల ద్వారా 24 లక్షలు, నాన్ ప్లాన్,  ప్లాన్ , ఇతర గ్రాంటుల ద్వారా 7  కోట్ల 50  లక్షలు వస్తాయని అంచనారు. 

అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తున్నాం: ఎమ్మెల్యే పద్మ 
నూతనంగా మెదక్ జిల్లా ఏర్పడ్డ తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళుతున్నదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చక్కటి విశాలమైన  రహదారులతో పాటు రహదారుల కిరువైపులా మొక్కలతో మెదక్ పట్టణాన్ని సుందరీకరిస్తున్నామని, త్వరలో 10 కోట్ల వ్యయంతో గోసముద్రాన్ని సుందరీకరిస్తూ పెద్దలు, పిల్లలకు ఆహ్లాద వాతావరాణాన్ని కల్పించేలా చక్కటి పార్కులు ఏర్పాటు చేయనున్నామన్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ వస్తారన్నారు. అధికారుల సహకారంతో బల్దియాను అన్ని విధాల అభివృదిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని  తెలిపారు. సుభాష్ రోడ్, నర్సిఖేడ్ రోడ్, దాయర రోడ్  విస్తరణ పనులతో పాటు వార్డులలో సి.సి.రోడ్లు, మురుగు కాలువలు వంటి నిర్మాణ పనులు ప్రాధాన్యత క్రమంలో  చేపడతామన్నారు. ప్రజలు మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి వార్డు శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేస్తుండాలన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వాస్తవిక బడ్జెట్ రూపొందించామని, ప్రతిపాదించిన అంచనాలకు అనుగుణంగా నిధులు సమీకరించడంతో పాటు నిర్దిష్టమైన పనులు చేపట్టి సకాలంలో ఖర్చు చేయుటలో శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని కోరారు. మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్ మాట్లాడుతూ  జిల్లా ఏర్పడ్డ తరువాత రైలు, మాతా శిశు సంరక్షణ కేంద్రం, గురుకుల పాఠశాలలు తెచ్చుకున్నామని, త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోనున్నామని అన్నారు.ఇకముందు కూడా అందరం అభివృద్ధి పధంలో చేయు చేయి కలిపి పనిచేద్దామని అన్నారు. కౌన్సిలర్లు, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.