జగిత్యాల మాత శిశు ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు

జగిత్యాల మాత శిశు ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు
  • ఆసుపత్రి విధుల్లో వైద్యులు లేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి 
  • విధులకు డుమ్మా కొట్టిన వైద్యులఫై చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి 
  • సౌకర్యాలపై  రోగులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అందులోని ప్రతి వార్డు తిరిగి అక్కడ ఉండే గర్భిణీలతో, వారి అటెండ్లతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను తెలుసుకున్నారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, మందులు సక్రమంగా అందుతున్నాయా, వైద్యం బాగుందా లేదా అన్న వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కాబట్టి మీరు ఇచ్చే సమాధానం నాకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

ప్రభుత్వం ఆస్పత్రులలో అన్ని రకాల మందులను అందిస్తుంది కాబట్టి ఎక్కడైనా సమన్వయ లోపం వల్ల మందులు సరైన సమయానికి పేషెంట్లకు అందుతున్నాయా లేవా అన్న వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు వారికి అవసరం ఉన్న అన్ని మందులను ఆసుపత్రి వారే సమకూర్చి ఇచ్చారని అన్ని రకాల పరీక్షలను ఆస్పత్రిలోనే చేశారని పేషెంట్లు సమాధానం ఇచ్చారు. తర్వాత పిల్లల ఇన్ పేషెంట్ వార్డుని సందర్శించిన మంత్రి అందులో అడ్మిట్ అయిన పిల్లలను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వమే అన్ని రకాల మందులతోపాటు టెస్టులను కూడా చేస్తుందని బయట ప్రైవేటులో చేయించుకోవద్దని మంత్రి వారి తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం వైద్యుల హాజరు పట్టికను తనిఖీ చేసి సూపరింటెండెంట్, వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నారు. 

డుమ్మా కొట్టిన వైద్యులఫై చర్యలకు ఆదేశం 
మాత శిశుఆసుపత్రిని మంత్రి హరీష్ రావు మధ్యహ్నం 2 గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో ఆసుపత్రి విధుల్లో సూపరింటెండెంట్ తో పాటు వైద్యులు ఎవరు లేరు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఒక్కరోక్కరు వచ్చారు. అప్పుడే వచ్చిన ఓ వైద్యుడిని మీ విధులు ఎన్ని గంటల వరకు అని మంత్రి ప్రశ్నించగా ఉదయం 9 నుంచి  2 గంటల వరకని.. ఓసారి 4 గంటల వరకని చెప్పగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల టైం తెల్వకపోతే ఏమి విధులు నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు విధులు నిర్వహించే తొమ్మిది నుండి నాలుగు గంటల సమయం వరకు విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపర్డెంట్ లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అనధికారికంగా లీవులు పెట్టిన వారిని మందలించి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య పరికరాలను, వైద్య సదుపాయాలను సమకూర్చిన నేపథ్యంలో వైద్యులు సమయానికి విధుల్లో ఉండి ప్రజలకు సేవలు అందించాలని మంత్రి తెలిపారు. 

అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా వైద్యులు సమన్వయంతో పని చేయాలని మంత్రి అన్నారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయవలసిందిగా మంత్రి కలెక్టర్ ను సూపరింటెండెంట్ ను ఆదేశించారు. స్వరాష్ట్రంలో సుపరిపాలన కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అట్లా ఏర్పాటు చేసుకున్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారని అందులో భాగంగా జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందింజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని అందుకు అనుగుణంగా వైద్యులు అధికారులు పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి పరికరాలను, వైద్యులను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది అని మంత్రి తెలిపారు.