వ్యవసాయానికి ఉపాధి హామీతో ఊతం

వ్యవసాయానికి ఉపాధి హామీతో ఊతం
  • మంత్రిగా పవన్ కల్యాణ్ సంతకం చేసిన తొలిఫైల్

అమరావతి, ముద్ర వార్తలు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానిస్తూ నిధుల మంజూరుపై మంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ తొలి సంత‌కం చేశారు. ఆ త‌ర్వాత గిరిజ‌న గ్రామాల్లో పంచాయ‌తీ భ‌వ‌నాల నిర్మాణంపై రెండో సంత‌కం చేశారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా రెండు ఫైళ్లపై మంత్రి హోదాలో ఆయన సంతకాలు చేశారు.

జాతీయ 'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని 2019లో ఆయన మాట ఇచ్చారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నామని, మహిళా దినోత్సవం రోజును పురస్కరించుకుని రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. రైతు ఆడపడుచుల విన్నపాలు అందిన తరువాత వచ్చిన ఆలోచనే ఇది' అని 2019లో మహిళా దినోత్సవ కార్యక్రమంలో జ‌న‌సేనాని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌బెట్టుకున్నారు.