ముందస్తుకు కేంద్రం?!

ముందస్తుకు కేంద్రం?!
  • ‘ఇండియా’కు చెక్ పెట్టేందుకే ?
  • 18 నుంచి 22 వరకు పార్లమెంట్ స్పెషల్ సెషన్​
  • ఈ సమావేశాలలోనే ‘వన్​ నేషన్, వన్ ఎలక్షన్’​ బిల్
  • ఆమోదం తర్వాత లోక్ సభ రద్దుకు అవకాశం!
  • డిసెంబర్​లోగా రాష్ట్రాలతో కలిపి ఒకేసారి పోలింగ్ 
  • ఈ యేడాది జరిగే ఐదు రాష్ట్రాలకు, వచ్చే యేడు జరిగే రాష్ట్రాలకూ ఒకేసారి ఎన్నికలు 
  • ఇండియా కూటమి బలపడుతుందంటున్న కేంద్ర నిఘా వర్గాలు
  • సమయం ఇస్తే ఎన్డీయేకు కష్టకాలం తప్పదనే సంకేతాలు
  • అందుకే ఎన్నికలకు సిద్ధమవుతున్న నరేంద్ర మోడీ టీమ్
  • ధరల తగ్గింపుతో మొదలవుతున్న కేంద్రం తాయిలాలు


డిసెంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు, లోక్ సభకు ఎన్నికలు నిర్వహించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సివుంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు వచ్చే యేడాది ఏపీ, ఒడిశాకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలో కొన్నాళ్లుగా ముందస్తుకు వెళతారనే ప్రచారం జరిగినా, సీఎం జగన్ అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కొట్టిపడేశారు. కానీ, పక్కనే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందస్తుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారంతో కేంద్రంపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే యేడాది జూన్‌ వరకు గడువు ఉన్నప్పటికీ, ఈ డిసెంబర్‌లోనే ఎన్నికలు ఎదుర్కోవాలని నవీన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనుమానాలను పెంచేస్తోంది. 

మమత, నితీశ్ మాటలతో

డిసెంబర్‌లో ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఆలోచిస్తోందని, దేశంలో ఉన్న హెలికాప్టర్లన్నీ ముందుగానే బుక్ చేసేసుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదే సమయంలో ఆరోపించారు. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే హెలికాప్టర్‌లను ఎందుకు బుక్ చేసుకుంటారని దీదీ ప్రశ్నించారు. ఇదే అనుమానం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల కామెంట్లపై స్పందించడం లేదు. తన పని తాను చేసుకుంటానన్నట్లు గుట్టుచప్పుడు కాకుండా రాజకీయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వేస్తున్న అడుగులను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్సే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో:దేశ రాజకీయాలలో ఒక్కసారిగా ముందస్తు అంశం చర్చకు వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వరాలను కురిపిస్తున్నది. నాలుగేండ్ల నుంచి పెంచుతున్న గ్యాస్ ధరలను తగ్గించడమే కాకుండా, త్వరలో పెట్రో ధరలను కూడా తగ్గించే అవకాశాలు కనపిస్తున్నాయి. దీనికి తోడుగా అటు ఈసీ కూడా ఎన్నికల ఏర్పాట్లను స్పీడ్​చేస్తున్నది. దీంతో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్రంలో మోడీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలు దిశగా కొద్ది రోజులు ప్రయత్నాలు జరిగాయి. దేశంలో ఎప్పటికప్పుడు ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని భావించిన ప్రధాని దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మొగ్గు చూపారు. కానీ, ఇది ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మరో ఏడెనిమిది నెలలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది. ఇప్పటికే లా కమిషన్ అధ్యయనం పూర్తి కావడంతో దీనిపై కేంద్రం ‘జమిలి’ మీద కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సీఈసీకి సంకేతాలు కూడా పంపింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది.

అందుకే స్పెషల్ సెషన్​

సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' బిల్లును ప్రవేశపెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలోచన గతంలో చాలాసార్లు ప్రస్తావనకు వచ్చినా సాధ్యం కాలేదు. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో బిల్లు పెట్టి ఆమోదించుకుంటే, ముందస్తు ఎన్నికలకూ మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది. కేంద్రం ఉద్దేశం మాత్రం స్పష్టం కావడం లేదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఈ యేడాది చివరన జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే యేడాది, ఆ తర్వాత జరిగే ఎన్నికలు కూడా ముందుకు జరపవచ్చని కేంద్రం భావిస్తోంది.


ఇండియా కూటమి బలపడుతుందనేనా!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు గడిచాయి. కర్ణాటక ఎన్నికల వరకు దేశంలో బీజేపీ బలంగా ఉందనే ప్రచారం జరిగింది. 2014 నుంచి కర్ణాటక ఎన్నికల ముందు వరకు వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని గెలుస్తూ వచ్చిన బీజేపీకి కర్ణాటకలో షాక్ తగిలింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనూహ్యంగా కాంగ్రెస్​పుంజుకుంది. కర్ణాటక జోష్‌తో తెలంగాణలో అసలు సోదిలోనే లేదనుకున్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా నిలుస్తుండగా, అప్పటివరకు జోరు చూపించిన బీజేపీ డీలాపడిపోయింది. జోడోయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లిన రాహుల్‌గాంధీ కూడా దేశ రాజకీయాలలో జోరు పెంచారు. మరికొన్నాళ్లు సమయం ఇస్తే రాహుల్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని బీజేపీ అనుమానిస్తోంది. 2019లో ‘మా ప్రధాని అభ్యర్థి మోడీ, మీ ప్రధాని ఎవరు?’ అని కాంగ్రెస్‌ను ప్రశ్నించి ఓటు యుద్ధంలో కాంగ్రెస్​ను బీజేపీ దెబ్బతీసింది. ఆ ఎన్నికలకు ముందు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు మాత్రం తనే సైనికుడిగా యుద్ధ క్షేత్రంలో తలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలోని 28 పార్టీలు కాంగ్రెస్​తో చేతులు కలిపాయి. ఇండియా కూటమి పేరుతో కదనరంగంలోకి దూకుతున్నాయి. కూటమి బలపడుతుందని కేంద్ర నిఘా వర్గాలు కూడా నివేదికలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముందస్తుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.  ప్రస్తుతం ఇండియా కూటమికి కన్వీనర్ లేరు. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేదు. ముంబైలో జరుగుతున్న సమావేశాలలో కన్వీనర్​, ప్రధాని అభ్యర్థి అనే అంశాలు పక్కన పెడితే.. కూటమి బలం పెరుగుతుందని మాత్రం నిరూపితమవుతున్నది. మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయం గందరగోళంగా మారింది. అక్కడ ఏ పార్టీ పూర్తిగా కోలుకోకముందే దెబ్బతీయాలంటే ముందస్తు ఒక్కటే మందని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

భయం కూడా ఉంది

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తే అసలుకే మోసం వస్తుందని భయం కూడా బీజేపీలో ఉంది. కర్ణాటక మాదిరిగా ఏదైనా తేడా జరిగితే.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా పడుతుందని భయపడుతున్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్నా.. ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం కేంద్రంపై పడకూడదన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదనే అంచనాలతోనే వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలంపై అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి అన్నివైపుల నుంచి ఆలోచిస్తున్న కమలదళం ముందస్తుగానే సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేస్తోందన్న ప్రచారమే దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా వినిపిస్తోంది.

ధరల తగ్గింపు కూడా

మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ధరలను తగ్గించింది. గ్యాస్ ధరలతో సామాస్య జనంపై బాదుడు బాదిన కేంద్రం.. ఒకేసారి రూ. 200 తగ్గిస్తూ అమల్లోకి తీసుకువచ్చింది. మరోవైపు కొంతకాలంగా పెట్రో ధరలను స్థిరంగా నిలిపినా.. ఇప్పుడు లీటరుపై రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఇలా ధరల తగ్గింపు ప్రక్రియను కూడా పరిశీలిస్తే.. కేంద్రం ముందస్తుకు వెళ్లడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.