రేవంత్.. నీ భాష మార్చుకో!
![రేవంత్.. నీ భాష మార్చుకో!](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d47e51bdbe6.jpg)
- కేసీఆర్ తో నీకు పోలికా?
- కాంగ్రెస్ కార్యకర్తలే నీకు పిండం పెడతారు టీపీసీసీ చీఫ్పై శ్రీనివాస్ గౌడ్, సత్యవతి ధ్వజం
ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ నాయకుడు సీఎం కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని , భాష మార్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. కనీస పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించలేని స్థితిలో రేవంత్ ఉన్నారని వారు విమర్శించారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యే ఎ. వెంకటేశ్వర రెడ్డి కలిసి మాట్లాడారు.
- 2018 కంటే ఘోరమైన స్థితిలో కాంగ్రెస్..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని నడిపించగలరా అని రేవంత్ రెడ్డిని మినిస్టర్లు ప్రశ్నించారు. 2018 కంటే ఘోరమైన స్థితికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. గద్దర్ గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గద్దర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయితే, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు వెళ్లారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. గద్దర్ పై కాల్పులకు నాటి సీం చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు పిండం పెడతామని అంటున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలే పిండం పెడతారని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక్క మాట అంటేనే రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించిందని, మరి చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డికి కోర్టు ఎన్నిసార్లు శిక్షలు వేయాలని వారు అన్నారు. తెలంగాణ ఎలా వచ్చిందో, ఎవరు పోరాడారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడి మాదిరిగా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా వంద సీట్లతో బీఆర్ఎస్ మల్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రులు తెలిపారు.