విద్యార్థులకు పోలీసు కళాబృందం అవగాహన

విద్యార్థులకు పోలీసు కళాబృందం అవగాహన

ముద్ర ప్రతినిధి, మెదక్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా  ఉండాలని, బాల్య వివాహాలు అనర్థాలు తదితర సామాజిక అమశాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహనా కల్పిస్తున్నారు.   జిల్లా ఎస్.పి.రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో మెదక్  పట్టణంలోని వెలుగు వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో షి టీమ్, యాంటీ ఉమెన్ ట్రాఫిక్ యూనిట్ సంబంధించిన అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల జరిగే అనర్ధాలు గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నిబంధనలు, ప్రేమ వివాహాలు వాటి అనర్దాలు, పోలీస్ చట్టాల గురించి విధ్యార్ధులకు వివరించారు. ఈ సందర్భంగా  కళాబృందం వారు మాట్లాడుతూ....విద్యార్ధులు చదువుకునే వయసులో ప్రేమ పట్ల ఆకర్షితులై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఉన్నత చదువులు చదివి తమ కన్న వారి కలలు నెరవేర్చాలని అలాగే  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాల్ చేసి మీకు లాటరీలు తగిలినాయి.

 మీకు లోన్స్ ఇస్తామని, తక్కువ ధరకే ఆన్లైన్ లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే పోలీసు వారి డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు బానిసలు కారాదని మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలపాలని, అలాగే రోడ్డుపై వెళ్తున్నప్పుడు పరిమిత వేగంలో వెళ్లాలని తప్పకుండా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.  కళాబృందం సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై పాటల రూపంలో మాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి. వరలక్ష్మి, అధ్యాపకులు చంద్రలేఖ, కళ, మహేష్, దయాకర్, ఎస్.ఐ మల్లయ్య, కళా బృందం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కళా బృందం సబ్యులు, షీ టీం బృందం, విధ్యార్ధులు పాల్గొన్నారు.