హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ పేరుతో రేవంత్ యాత్ర
![హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ పేరుతో రేవంత్ యాత్ర](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d3940195929.jpg)
ఎన్నికల కదనరంగంలో అడుగుపెట్టిన తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కదనరంగంలో అడుగుపెట్టింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ పేరుతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది. ఈ మేరకు ఈ యాత్రను ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినా ఫిబ్రవరి 6 నుంచి సీరియస్ గా సాగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి అందరూ సహకరించాలని ఇప్పటికే రేవంత్ పార్టీ నాయకులను కోరారు.
ఆయన పిలుపునకు స్పందించిన చాలా మంది నేతలు వారి జిల్లాల్లో ‘హాథ్ సే హాథ్ జోడో’ ను ప్రారంభించారు. ఇక రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా బొంరాస్ సేట్ మండల మదనపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ప్రారంభించారు.’హాథ్ సే హాథ్ జోడో యాత్ర ‘ 60 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో రాష్ట్రంలో ఇంటింటికి ఆయా ప్రాంతాల నాయకులు వెళ్లనున్నారు. వారి సమస్యలను వినతులు స్వీకరించనున్నారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీపీసీసీ కార్యాలయానికి పంపిస్తారు. వీటిని పరిగణలోకి తీసుకొని వచ్చే ఎన్నికల్లో ఆ సమస్యలపై పోరాడనున్నారు. ఇక ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని హావిూని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ లో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది.మొన్నటివరకు అసంతృప్తులతో కొట్టుమిట్టాడిన టీ కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చినట్ల తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అందరూ కలిసి రావాలని లేకుంటే విూకే నష్టం అని ఢల్లీి పెద్దలు హెచ్చరించినట్లు సమాచారం. ఇక హాథ్ సే హాథ్ జోడో యాత్రలో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలిపారు. దీంతో ప్రతినేత ఇందులో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. గురువారం ప్రారంభించిన యాత్రలలో యాదాద్రి జిల్లాలో పాల్వాయి స్రవంతి కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ లాంటి వారు పాల్గొన్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’తో కాంగ్రెస్ ప్రజలకు చేరువవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ విధానాలు ప్రజలకు నచ్చడం లేదని వారికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారనుందని చెప్పనున్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేయనున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రచారం చేయనున్నారు.