ఎన్నికల ఓటరు జాబితా నుండి తొలగింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలి
![ఎన్నికల ఓటరు జాబితా నుండి తొలగింపు ప్రక్రియ పకడ్బందీగా జరగాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64368195780e3.jpg)
నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నందున సరైన విచారణ లేకుండా ఓటరు జాబితా నుండి పేర్లు తొలగించరాదు - ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సాధారణ ఎన్నికలు ఉన్నందున గత సంవత్సరం నుండి జాబితా నుండి తొలగించిన పేర్లను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలంగాణా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఓటరు జాబితాలో ఒకే రకమైన ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ కలిగినవి, మరణించిన ఓటర్లు, స్థానికంగా లేకుండ ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించినట్లయితే తొలగించిన పేర్లను పునఃపరిశీలించాల్సిందిగా సూచించారు.
పేర్ల తొలగింపు లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మరణించిన ఓటర్ల పేర్లు తొలగించడానికి మరణ ధృవీకరణ పత్రం, ఫారం 7 క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. స్థానికంగా లేకపోవడం వంటి విషయంలో సంబంధిత చిరునామాకు నోటీసు ఒకటికి రెండుసార్లు పంపించి పూర్తి విచారణ అనంతరమే పెరు తొలగించాల్సి ఉంటుందన్నారు. ఎస్.ఎస్.ఆర్ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారణలు చేపట్టాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులను ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం పొందుతున్న వారిని తప్ప ప్రయివేట్ ఉద్యోగులను లేదా మహిళా సంఘాల వ్యక్తులను బి.ఎల్.ఓ లుగా నియమించడానికి వీలు లేదన్నారు. ఒకవేళ అలాంటి ఎంపికలు ఉంటే వారం లోపు పునఃనియమకం చేసుకోవాలని తెలియజేసారు. ఓటరు నమోదు కై ఎస్.ఎస్.ఆర్ తర్వాత వచ్చిన దరఖాస్తులను బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలన చేయించి పోర్టల్ లో నమోదు చేయించాలని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మరియు అచ్చంపేట 3 నియోజకవర్గాల పరిధిలోని 16,995 ఓటర్లు డబల్ ఎంట్రీ ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఇప్పటివరకు 1,236 రెండుచోట్ల కలిగి ఉండటం లేదా స్థానికత మార్పిడి చేసుకున్న ఓటర్ల పేర్లను పూర్తి విచారణ అనంతరమే తొలగించినట్లు తెలియజేసారు. పెండింగ్ లో ఉన్న 15,759 దరఖాస్తులను నిర్ణిత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమాన్ నాయక్ ఎలక్షన్ సెక్షన్ సూపరిండెంట్ రవికుమార్, సెక్షన్ క్లర్క్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.