పల్లె ప్రగతితో అద్భుత అభివృద్ధి

పల్లె ప్రగతితో అద్భుత అభివృద్ధి
  • గ్రామాల రూపురేఖలు మారిపోయాయి
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చర్లబుత్కూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో ప్రజలు నీటి కష్టాలు అనుభవించారని, గ్రామపంచాయతీకి కార్యదర్శి లేకపోవడంతో గ్రామస్థాయి పాలన కుంటుపడిందని వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడంలో వారు మనస్ఫూర్తిగా పని చేసేవారు కాదని తెలిపారు. చెత్త నిర్వహణకు సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్తను వేసేవారని, వ్యక్తి మరణిస్తే కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 

గ్రామాలలో పారిశుద్ధ్యం నిరంతరం కొనసాగించడానికి, గ్రామంలోని చెత్తాచెదారం సేకరించడానికి వాటిని తరలించడానికి గ్రామంలో మొక్కలు సంరక్షించడానికి ప్రతి  గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ ను సమకూర్చడం జరిగిందన్నారు. సేకరించిన తడి చెత్తను కంపోస్ట్ గా పొడి చెత్తను నిర్వహించడానికి ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరణించిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపేందుకు వైకుంఠధామం నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. అంటువ్యాధులు అరికట్టడానికి మిషన్ భగీరథ రూప కల్పన చేసి ఇంటింటికి నల్ల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నాం అని పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం తో కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చి నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. హరితహారం లో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన కార్మికులు ఉంటేనే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచగలమని గమనించిన ప్రభుత్వం ప్రతి 500 జనాభాకు ఒక మల్టీ పర్పస్ వర్కర్ ను నియమించడంతో పాటు వారి వేతనాలను 9500 చేసింది. పక్కనే గోదావరి ఉన్న చెరువులు నిండేవి కాదన్నారు. 

గతంలో రైతులు పొలం దగ్గర  కరెంటు కోసం వేచి చూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయని వ్యాఖ్యానించారు. భూమికి బరువు అయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు. అన్ని వర్గాలు క్షేమంగా బతకాలనే ఉద్దేశంతో కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, దళిత బంధు, యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, కులవృత్తులకు అనేక పథకాలు ప్రజల అభివృద్దే లక్ష్యంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సత్కరించారు. అంతకుముందు మండలంలోని జూబ్లీ నగర్ లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి, రూ.5 లక్షల తో నిర్మించిన ముదిరాజ్ భవనమునకు, 10 లక్షల వ్యయంతో నిర్మించిన పద్మశాలి భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, ఎంపీపీ టి.లక్ష్మయ్య, ఫ్యాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచ్ డి రమణారెడ్డి, రుద్ర భారతి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, పంచాయతీ ఈ ఈ శ్రీనివాసరావు, జడ్పిటిసి, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.