ఎయిమ్స్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఎయిమ్స్ లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: ఆపదలో వున్న రోగికి రక్తదానం చేసి వారి ప్రాణాలు నిలపడంకన్నా గొప్ప సాయం ఇంకేమీ లేదని బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. ఎయిమ్స్ లో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఎయిమ్స్ లోని ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంకు విభాగం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ-పోస్టర్, క్విజ్ పోటీలను నిర్వహించారు, ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ రక్తదానం ప్రాముఖ్యతను వివరించి, అక్కడికి హాజరైన వారిని చైతన్యపరిచారు. కార్యక్రమంలో స్వచ్ఛంద రక్తదాతల నమోదును ప్రారంభించారు. ఎయిమ్స్ కు వచ్చే స్వచ్ఛంద రక్తదాతలను, పోటీలలో విజేతలను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో అఫిషియేటింగ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) బిపిన్ వర్గీస్, డాక్టర్ అపర్ణ శర్మ, డాక్టర్ శ్యామలా అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.