మద్యానికి బానిసై.. కుటుంబాన్ని వేదిస్తున్న తండ్రి.. రోకలి బండ తో కొట్టి చంపిన కొడుకు..

మద్యానికి బానిసై.. కుటుంబాన్ని వేదిస్తున్న తండ్రి.. రోకలి బండ తో కొట్టి చంపిన కొడుకు..

మెట్‌పల్లి ముద్ర: మద్యానికి బానిసై  కుటుంబ సభ్యులను వేదిస్తు ఇంట్లో గొడవలకు కారణమవుతున్న తండ్రిని ఓపిక నశించిన ఓ కొడుకు రోకలి బండతో మోది హత్య చేసిన సంఘటన కోరుట్ల మండలంలోని సంగెం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన వల్లకొండ చిన్న మల్లయ్య(52) కు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న మల్లయ్య గత పదిహేను సంవత్సరాలు గల్ఫ్ లో పనిచేసి ఇంటికి తిరిగి వచ్చి ఇంటి వద్దే  ఖాళీగా ఉంటున్నాడు. ప్రతి రోజు మద్యం సేవిస్తూ  భార్య, కుటుంబ సభ్యులతో ఏదో రకంగా గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ వేధింపులు తీవ్రమవడంతో గురువారం అర్ధరాత్రి చిన్న మల్లయ్య పెద్ద కొడుకైన వల్లకొండ పవన్ గొడవలు మానుకోవాలని తండ్రిని మందలించాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరిగి   క్షణికావేశంలో తండ్రిని రోకలిబండతో మోదాడు. దీంతో చిన్న మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పవన్ పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపి పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.