ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెక్!
- త్వరలో నగదు రహిత చెల్లింపులకు వెసులుబాటు
- పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపై స్థాయి బస్సులన్నింట్లో ఐ–టిమ్స్
- డెబిట్, క్రెడిట్కార్టులు, ఫోన్పే, గూగుల్ పేవంటి వంటి వాటితో చెల్లింపులకు అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో ఇక నుంచి క్యాష్ లెస్ చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు కలుగునుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ–టిమ్స్ పరికరాలను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్పే, గూగుల్పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు బండ్లగూడ బస్ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ–టిమ్స్ను వాడేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.
టికెట్ ధర పెంపు అందుకే..
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరుగుతుంటాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం బస్ టికెట్ల ధరలను రూ.10, 15, 20 ఇలా రౌండ్ ఫిగర్గా మార్చేసింది. అయినా ఈ సమస్యకు పాక్షింకంగా పరిష్కారమే లభించింది. దూరప్రాంత, అధిక ఛార్జీలుండే 700 సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లోనే ఐ–టిమ్స్ను ప్రవేశపెట్టగలిగారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్మాత్రమే ఉన్నాయి.
తీరనున్న కష్టాలు..
ప్రస్తుతం దేశం మొత్తం క్యాష్ లెస్విధానమే నడుస్తుంది. చిన్న టీ కొట్టు, కూరగాయల మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఈ వెసులు బాటు ఉంది. ప్రజల కూడా ప్రతి దగ్గర యూపీఐని వినియోగించే సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో బస్సు ఎక్కాలంటే మాత్రం కచ్చితంగా నగదు ఉండాల్సిందే. దీంతో ప్రయాణికులు చాలాచోట్ల ఇబ్బందులు పడిన ఘటనలు కూడా లేకపోలేదు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తప్పనున్నాయి. నగదు రహిత చెల్లింపులతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.