కాళేశ్వరం విలువ  కష్టకాలంలో తెలుస్తుంది

కాళేశ్వరం విలువ  కష్టకాలంలో తెలుస్తుంది
  • రాష్ట్రంలో నీటి ఎద్దడి రానీయొద్దు
  • రైతుల కోసం కంటిన్ జెన్సీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి
  • విద్యుత్ డిమాండ్ ను అంచనా వేయాలి
  • ముఖ్యమంత్రి కేసీఆర్​
  • నదులు, రిజర్వాయర్లలో నీటి లభ్యతపై అధికారులతో సమీక్ష

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో అలాంటిపరిస్థితి రానీయొద్దని సీఎం కేసీఆర్​అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, కష్టకాలంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాపాతం, నదుల్లో, రిజర్వాయర్లలో నీటి లభ్యత, విద్యుత్ డిమాండ్ తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం ఆదివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

నీటి నిల్వలను పర్యవేక్షించాలి..

తెలంగాణలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా అందుకోసం చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్ ను నింపాలన్నారు. అక్కడి నుంచి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్లను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్లను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  

కంటిన్ జెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలి

రాష్ట్రంలో కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో కొన్ని ఎండిపోయాయని, ఈక్రమంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగేవిధంగా “కంటిన్ జెన్సీ ప్లాన్” సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సీఎం సూచించారు. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల నుంచి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందని, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామని  సీఎం తెలిపారు. 

ఇరిగేషన్​శాఖకు ఇది పరీక్షా సమయం..

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉన్నదన్నారు. ఇన్ని రోజులు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని కేసీఆర్​అన్నారు. ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైంఅని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు.  నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతుంది. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి’. అని పేర్కొన్నారు. 

నీటి నిల్వలు చెక్ చేసుకోవాలి..

తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని, తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. కాగా ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్ కో కు ఇచ్చేలా విధివిధానాల ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.  పాలేరు రిజర్వాయర్ కు నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. “ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. రోజూ ఒక టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను 24 గంటలు నడిపిస్తూనే ఉండాలి. సుందిల్ల నుంచి అంతే నీటిని మిడ్ మానేరు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా  కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు చిన సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి” అని సీఎం అన్నారు.

విద్యుత్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి

ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని అని సీఎం ఆదేశించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. సమీక్షలో మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్ రెడ్డి, దయకార్ రావు, జగదీశ్​రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సుమన్, జాజుల సురేందర్, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.