పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేం : సీఎం కేసీఆర్
![పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేం : సీఎం కేసీఆర్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64feb3e55d75c.jpg)
హైదరాబాద్: అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని, అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని, ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన వారికి నివాళర్పించారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామన్నారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ - 2022 హైదరాబాద్ కు దక్కిందన్నారు.
అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం కావాలని పేర్కొన్నారు. పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నామని, అందుకే మనతో పాటు, భవిష్యత్ తరాలు కూడా ఈ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని కేసీఆర్ అన్నారు. ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని, హరిత తెలంగాణ కోసం మన లక్షిత పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునచ్చారు. అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు హృదయ పూర్వక శ్రద్ధాంజలి. వీరి ఆశయాలు సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్దితో మనం అమలు చేయాలి. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలని పేర్కొన్నారు.