తెలంగాణోద్యమంలో మీడియా పాత్ర కీలకం: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

తెలంగాణోద్యమంలో మీడియా పాత్ర కీలకం: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • జర్నలిస్టులకు ఐదేకరాల్లో ఇంటి స్థలాలు
  • జనగామ ఎమ్యెల్యే యాదగిరి రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీడియా పోషించిన పాత్ర అభినందనీయమని, ప్రధానంగా జర్నలిస్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషి వెలకట్టలేనిదని జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కొనియాడారు. సోమవారం నాడు జనగామా పట్టణంలోని విజయ ఫంక్షన్ హాలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) జనగామా జిల్లా శాఖ ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీ వరకు బలంగా వినిపించి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన ఘనత మీడియాదే అన్నారు. టీయూడబ్ల్యూజే విన్నపం మేరకు జనగామలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఐదేకరాల స్థలాన్ని కేటాయించామని, త్వరలోనే ఇలాంటి సభ ఏర్పాటు చేసి పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్యెల్యే యాదగిరి రెడ్డి ప్రకటించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఐజేయూ సీనియర్ నాయకులు, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ దేశానికే స్ఫూర్తి కలిగించే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే సంఘం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే స్ఫూర్తితో టీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యకలపాలతో పాటు మీడియా స్వేచ్ఛ కోసం, జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా నాటి నుండి నేటి వరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు అమర్ స్పష్టం చేశారు. గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వాలకు లొంగకుండా, జర్నలిస్టుల పక్షపాతిగా దాదాపు ఆరు దశాబ్దాలుగా రాజీలేని పోరాటాలు చేస్తున సుదీర్ఘ చరిత్ర, ఘనత తమ సంఘానిదే అన్నారు. మూత పడిన మీడియా సంస్థలను తెరిపించడంలో, జర్నలిస్టులకు సౌకర్యాల సాధనలో తమ సంఘం పోషించిన పాత్ర చరిత్రాత్మక మైందన్నారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య భద్రతా, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం, చిన్న, మధ్యతరగతి పత్రికలు, మేగజైన్లకు న్యాయం చేయడం కోసం టీయూడబ్ల్యూజే పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. పవిత్రమైన మీడియా వృత్తికి చెడ్డపేరు తెచ్చేవిధంగా జర్నలిజం ముసుగులో అరాచకాలు చేస్తున్న శక్తులకు తగిన బుద్ధి చెప్పడంలో తమ సంఘం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.జనగామ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధుగౌడ్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాధవరావు, జిల్లా కార్యదర్శి భిక్షపతిలతో పాటు దాదాపు 250మంది జర్నలిస్టులు హాజరయ్యారు.