సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: సుమారు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో బాధితలకు మరింత నష్టపరిహారం విషయంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అదనపు పరిహారం కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం  తోసిపుచ్చింది. 1984 డిసెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా ప్లాంట్ నుంచి మిథైల్ ఐసో సైనేట్  అనే అత్యంత విషపూరిత వాయువు లీక్ అయింది. ఈ దుర్ఘటనలో అప్పటికప్పుడే 3,000 మంది మరణించగా, 1.02 లక్షల మంది విషయవాయువుల ప్రభావానికి లోనయ్యారు. ప్రపంచలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా దీనిని పరిగణిస్తుంటారు.  ఈ కేసును రీఓపెన్ చేయాలని, అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కంపెనీల నుంచి రూ.7,844 కోట్ల అదనపు పరిహారం చెల్లించేందుకు ఆదేశించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో మానవ జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదని కేంద్రం వాదించింది. అయితే, ఈ పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చుతూ, మోసపూరితంగా మాత్రమే సెటిల్‌మెంట్‌ను పక్కన పెట్టవచ్చని, కేంద్రం ఆ పాయింట్‌పై ఎలాంటి వాదనలు చేయలేదని పేర్కొంది. రెండు దశాబ్దాల ఈ అంశాన్ని కేంద్రం లేవనెత్తడంలో హేతుబద్ధత కూడా లేదని తెలిపింది. క్యూరేటివ్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారం క్లెయిమ్స్ కోసం రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న రూ.50 కోట్లు వినియోగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం వేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కృష్ణలాల్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును గత జనవరి 12న రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేఎం మహేశ్వర్ సభ్యులుగా ఉన్నారు.