తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించిన సోనియా

తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించిన సోనియా
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్
  • ఇచ్చింది మేమే-తెచ్చింది మేమే
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం కొత్త బస్ స్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రదాత  సోనియా గాంధీ గారి చిత్రపటానికి పటానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

స్వరాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల తో సోనియాగాంధీ చలించిపోయిందన్నారుగతంలో బిజెపి అధికారంలోకి వచ్చే సమయంలో చిన్న రాష్ట్రాలుగా తెలంగాణను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు పొమ్మనే విధంగా వ్యవహరించిందన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, బిజెపి అడ్డుపడ్డ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. చిన్న రాష్ట్రాలకు మేం వ్యతిరేకం అంటూ బహిరంగంగానే చెప్పుకున్న ఆ పార్టీ నేతలు, తెలంగాణ తమ తోనే సాధ్యం అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఆనాడు కెసిఆర్ సోనియా గాంధీతో  చెప్పిన మాట వాస్తవం కాదా అన్నారు. మోసం చేసే నైజం కాంగ్రెస్‌కు ఎప్పుడూ లేదని అది కెసిఆర్ వంట బట్టిందని గుర్తుకు చేశారు.  
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రజలను తప్పుదారి పట్టించి ఉద్యమం చేసిన కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కేవలం ప్రగతి భవన్ కే పరిమితమవుతున్న   సీఎం ఏ ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట, ఇలా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు,  ప్రజలు, ఉపాధ్యాయ, ఉద్యోగుల గొంతుకను తొక్కి పట్టిస్తూ కెసిఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆగ్రహానికి గురైన ఏ పరిపాలకులు కూడా ప్రపంచంలో మనుగడ కొనసాగించిన దాఖలాలు లేవన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మనమంతా రుణపడి ఉండాలన్నారు.