హుజూర్ నగర్ లో తెలుగుదేశం ధర్నా , రాస్తారోకో
ముద్ర, హుజూర్నగర్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. హుజూర్నగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్లో ధర్నా, పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని విమర్శించారు. ఆర్థిక నేరాలలో చిక్కుకొని 16 నెలలు చిప్పకూడుతున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును జైలు పాలు చేయాలనే కోరికతోనే కుట్రలకు తెర లేపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో విశ్వాసం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, దౌర్జన్యం ,అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్న విషయం యావత్ ప్రజానీకం గమనిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు చంద్రబాబునాయుడుపై విశ్వాసం, తెలుగుదేశం పార్టీపై నమ్మకం పెరుగుతోందని, తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో అరెస్టులకు పురమాయిస్తున్నాడని విమర్శించారు.