చొప్పదండి బీజేపీ టికెట్ ఎవ్వరికి దక్కనుంది?

చొప్పదండి బీజేపీ టికెట్ ఎవ్వరికి దక్కనుంది?
  • అయోమయంలో లోకల్ క్యాడర్...
  • శోభతో పాటు టికెట్ ఆశిస్తున్న సుద్దాల

ముద్ర, మల్యాల: చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్ రేపు ఎవ్వరికి వచ్చే అవకాశం ఉందనేది మండలంలో చర్చ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఈ సారి బొడిగే శోభతో పాటు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు.  గత ఏడాది నుంచి దేవయ్య నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. కాగా, 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి బొడిగే శోభ పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న శోభకు దేవయ్య ఎంట్రీతో టికెట్ వస్తుందో, లేదో అన్న సందేహం స్థానికంగా నెలకొంది. శోభ ఇప్పటివరకు నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకపోయినా.. ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. సానుభూతి, ప్రస్తుత ఎమ్మెల్యేపై అసంతృప్తి తనను గెలిపిస్తాయని ఆశతో శోభ ఉన్నారు. ఇది ఇలా ఉండగా, బీజేపీ పాత క్యాడర్ మాత్రం శోభపై ఇంట్రెస్ట్ గా లేరని తెలుస్తుంది. బుధవారం గంగాధరలో జరిగిన శోభ గృహప్రవేశం కార్యక్రమంపై పాత క్యాడర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్బంగా కొందరు నాయకులు మాట్లాడుతూ దేవయ్య అన్ని కార్యక్రమాలకు ఆర్థికoగా సహకరిస్తూ... పార్టీని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అధిష్టానం నియోజకవర్గంలో సర్వే చేసి, టికెట్ పై నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.