రాజారo యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్...

రాజారo యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్...

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాష్
 ముద్ర, మల్యాల: ఈనెల 9న రాత్రి మల్యాల మండలం రాజారాం గ్రామంలో జరిగిన యువకుడు గుర్రం వెంకటప్రవీణ్(28) హత్య కేసులో ఇద్దరు నిందితులు శివరాత్రి నరేష్, శివరాత్రి భాగ్యరాజ్ లను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. బుధవారం సాయంత్రం మల్యాల పోలీస్ స్టేషన్లో డీ ఎస్పీ ప్రకాష్ స్థానిక సీఐ, ఎస్ ఐ తో కలిసి హత్య సంబందించిన వివరాలు వెల్లడించారు.. రాజారo గ్రామానికి చెందిన హతుడు గుర్రం వెంకటప్రవీణ్ కు ఇదే గ్రామానికి చెందిన నిందితులు శివరాత్రి నరేష్, శివరాత్రి భాగ్యరాజ్ అనే అన్నదమ్ములకు గతంలో భూమి తగాదాలు ఉండగా, మరి కొన్ని సందర్భాలలో చిన్న చిన్న గొడవలు జరిగాయి.  

అయితే ఆ విషయమై పెద్దమనుషులు సమక్షంలో రాజీ కుదుర్చుకున్నప్పటికీ, ఎలాగైనా ప్రవీణ్ ను చoపాలని మనుసులో కక్ష పెంచుకున్నారు నిందితులు. ఈ క్రమంలో ఈ నెల 9 న రాత్రి గ్రామంలో బలగం సినిమా ప్రదర్శన జరిగే సమయంలో హతుడు తన స్నేహితుడుతో కలిసి బైక్ పై నిందితుల ఇంటి ముందు నుంచి స్టాండ్ దింపి రోడ్డుపై వెళ్లడం గమనించి, ఈ రోజు ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో రాత్రి  గ్రామ శివారులో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న వెంకటప్రవీణ్ వద్దకు వెళ్లి కర్ర, బీరుసీసాలతో తలపై కొట్టడంతో పాటు కిందపడిన హతుని తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు డిఎస్పి తెలిపారు.

అయితే హతుని స్నేహితులయిన గుర్రం వెంకటేష్, బోదాసు రాజశేఖర్ లు  దాడి సమయంలో అడ్డుకున్నప్పటికీ అడ్డు వస్తే చంపుతామంటూ నిందితులు బెదిరించడంతో పారిపోయినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కాగా, జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రమణమూర్తి, ఎస్ ఐ చిరంజీవి, సిబ్బంది అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను వారి ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుంచి హుందాయి కార్, బైక్, రెండు మొబైల్స్, కర్ర స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా హత్య కేసు చెదిoచడంలో కృషి చేసిన మల్యాల సిఐ రమణమూర్తి,ఎస్సై చిరంజీవి, ఏఎస్ఐ కృష్ణకుమార్ తో పాటు, పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.