ఎమ్మెల్యే గండ్రకు శుభాకాంక్షల వెల్లువ..

ఎమ్మెల్యే గండ్రకు శుభాకాంక్షల వెల్లువ..
  • గాంధీనగర్ నుండి క్యాంపు ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి మంగళవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రావడంతో ఆయనకు వివిధ ప్రాంతాలనుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డికి కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారిగా క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రావడాన్ని పురస్కరించుకొని గణపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గణపురం మండలం గాంధీనగర్ నుండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్దకు ర్యాలీగా  చేరుకొని ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. అదేవిధంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట్రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు లతోపాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీసుకు తరలివచ్చి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.