మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల వివక్ష తగదు (ఏఐటీయూసీ)

మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల వివక్ష తగదు (ఏఐటీయూసీ)
  • జీవో నెంబర్ 8/2023 ఫిబ్రవరి నెలలో విడుదల చేసి నాటి నుండి పెంచిన వేతనాలు చెల్లించాలి
  • భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన వంట కార్మికులు

భువనగిరి జూలై 17 (ముద్ర న్యూస్):- మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వివక్ష తగదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు.పెండింగ్ బిల్లులు పెంచిన వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం 8వ రోజు భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి  కి క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించిన వంట కార్మికులు. ఈ సందర్భంగా  ఇమ్రాన్ మాట్లాడుతూ 8 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలపై సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గత రెండు రోజుల క్రితం విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి  డిఇఓ లతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల వేతనాలు జూలై నెల నుండి పెంచుతున్నట్లు ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  18 నెలల క్రితం కార్మికుల వేతనం 3000 పెంచుతున్నట్టు ప్రకటన చేసిన, మంత్రిగారు కొత్త ప్రకటన చేయడం సరికాదన్నారు .కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన 9 నెలల బకాయి బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేదన్నారు. కోడి గుడ్లు, వంట పాత్రలు, వంట గ్యాస్ మరియు పిఎఫ్ ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు.అంగన్వాడీ సెంటర్ల మాదిరిగా నిత్యవసర వస్తువులను ప్రభుత్వమే స్కూళ్లకు సరఫరా చేయాలని వీటి పై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిన్న కృష్ణ, ముంతాజ్ బేగం, నాయకులు బచ్చమ్మ, మణెమ్మ, సంధ్య,  లక్ష్మి,  సామల పద్మ, దివ్య, కృష్ణ, నిర్మల అరుణ వసంత యాదమ్మ రాజమ్మ అండాలు వాణి తదితరులు పాల్గొన్నారు.