‘పాలమూరు–రంగారెడ్డి’పై  ఏపీ పిటిషన్​కొట్టివేత

‘పాలమూరు–రంగారెడ్డి’పై  ఏపీ పిటిషన్​కొట్టివేత
  • నీటి కేటాయింపు తమ పరిధి కాదన్న కృష్ణా ట్రిబ్యునల్
  • సరైన ఫోరంలో తేల్చుకోవాలని సూచన
  • 90 టీఎంసీలకు లైన్​క్లియర్ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ల కేటాయింపులపై తెలంగాణకు భారీ ఊరట లభించింది. పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపుపై ట్రిబ్యునల్‎ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్‎ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. నీటి కేటాయింపులు మా పరిధి కాదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జారీ చేసిన 246  జీఓపై కృష్ణా ట్రిబ్యునల్‎లో ఏపీ ప్రభుత్వం వేసిన కేసుపై బుధవారం తీర్పు వెలువడింది. ఈ అంశం తన పరిధిలో లేదని, సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెపుతూ కేసును కొట్టి వేసింది. దీంతో ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు అడ్డంకి తొలగిపోవడంతో డీపీఆర్ పరిశీలనను వేగవంతం చేసే అవకాశం ఉంది. కాగా ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, పర్యావరణ, మెటా, కేంద్ర భూగర్భ జల శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

వాటా వివాదాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో కృష్ణా జలాల్లో వాటాపై వివాదం తెగడం లేదు. సగం వాటాకు తెలంగాణ పట్టుపడుతుండగా.. గతంలో మాదిరిగానే కేటాయింపులు ఉండాలంటూ ఏపీ అడ్డంకులు చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే కృష్ణా ట్రిబ్యునల్​లో తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణ జరగగా ఊహించని తీర్పు వెలువరించింది. పాలమూరు నీటి కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్​లో ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. 

మా పరిధి కాదు..

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పై ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ పిటిషన్​ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసిందని, ట్రిబ్యునల్ కు చేసిన ఫిర్యాదులో వివరించింది. 90 టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొంది. చిన్న నీటి వనరుల వినియోగం కింద మిగిలిన 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో 45 టీఎంసీలు వినియోగించుకునే వెసులుబాటును చూపుతూ తెలంగాణ ఈ నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. అయితే ఈ పిటిషన్​ను విచారించే అధికారం తమకు లేదని, ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచిస్తూ పిటిషన్ కొట్టేసింది. 

ఇది ప్రజా విజయం : మంత్రి నిరంజన్​ రెడ్డి

పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యునల్ కొట్టివేయడం శుభ పరిణామమని, ఇది పాలమూరు ప్రజల విజయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో సబ్ జ్యూడిస్ అడ్డంకి తొలగిపోయినట్లుగా భావించవచ్చని, ఈ ఎత్తిపోతలకు ఇప్పటికే అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జలాశాఖ, విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలే ఈ విజయానికి కారణమని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అడ్డంకులు కేంద్రం వెంటనే గుర్తించి తొలగించాలని కోరారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని మంత్రి నిరంజన్​ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.