ప్రశాంతంగా పండగలు నిర్వహించుకోవాలి- మంత్రి అల్లోల

ప్రశాంతంగా పండగలు నిర్వహించుకోవాలి- మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెలలో రంజాన్ ప్రారంభమైన నేపథ్యంలో హిందువులు, ముస్లింలు సమైక్యంగా ఉండి పండగలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి సూచించారు. రంజాన్ సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, మత పెద్దలతో సోమవారం సాయంత్రం నిర్మల్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  పవిత్ర స్థలాల వద్ద ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలని, ముస్లిం సోదరులకు తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్మల్ పట్టణంలో చేపట్టిన ఈద్గా పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, రంజాన్ చివరి నాటికి ఇవి పూర్తవుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.