‘గృహలక్ష్మి’ నిరంతర ప్రక్రియ
![‘గృహలక్ష్మి’ నిరంతర ప్రక్రియ](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d47891a7afb.jpg)
- దరఖాస్తుల గడువు విషయంలో ఆందోళన వద్దు
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం కొత్తంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దరఖాస్తుల తుది గడువు విషయంలో దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ.3ల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలు ఖాళీ స్థలం వున్న ఎవరైనా సరే గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు లేదా స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ ఉన్నా, ఖాళీ స్థలం ఉన్నా సరే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు పంపించవచ్చని చెప్పారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3 వేల ఇళ్ల కేటాయింపులు వుంటాయని.. మిగిలిన వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.