రైతుల పట్ల కేసీఆర్ ది సవతి తల్లి ప్రేమ

రైతుల పట్ల కేసీఆర్ ది సవతి తల్లి ప్రేమ

మునగాల ముద్ర:-రైతాంగం పట్ల కేసీఆర్ ప్రభుత్వం మాటల్లో గొప్పలే తప్ప చేతల్లో సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వర రావు విమర్శించారు.మునగాల మండలం నారాయణగూడెం వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ షాక్ కు గురై మరణించిన తాళ్లపాక రాంబాబు కుటుంబ సభ్యులను శుక్రవారం కొల్లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార్య, ఇద్దరు పిల్లలు కలిగిన రాంబాబు అతి చిన్న వయస్సులోనే కరెంట్ షాక్ కు గురై అర్ధాంతరంగా చనిపోతే సత్తుబిళ్ళ సాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమెలా అవుతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ గారడీ మాటల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. తెలుగు రైతు సంఘం ఎల్లవేళలా రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడుతుందని, రాంబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి ఓరుగంటి ప్రభాకర్, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు కొల్లు నర్సయ్య, కార్యదర్శి గుండు నాగేశ్వరరావు, మునగాల, చిలుకూరు మండల శాఖల అధ్యక్షులు నాదెళ్ల గోపాలరావు, సాతులూరి గురవయ్య, ఉపాధ్యక్షులు అడిదెల సుబ్బారెడ్డి, మునగాల గ్రామ శాఖ అధ్యక్షులు వేట అశోక్ తదితరులు పాల్గొన్నారు.