వందరోజులలో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం

వందరోజులలో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం
  • రాష్ట్ర రోడ్లు భవనాలు,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :వందరోజులలో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం ఆయన బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో 6 కోట్ల 31 లక్షలతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మైలారం గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దావఖానా నూతన భవనాన్ని ప్రారంభించి బెడ్ల ఏర్పాటు కోసం మంత్రి స్వంత డబ్బులు 50 వేల రూపాయలు స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఆయన మాట్లాడుతూ వందరోజులలో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. హాజీపూర్  బ్రిడ్జిని ఆరు నెలల లోపు పూర్తి చేస్తామని, అలాగే హాజీపూర్ గ్రామంలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అఘాత్యాలకు బలైపోయిన బాలికల కుటుంబాలకు అండగా ఉంటామని, వారి కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని,  అలాగే వారి కుటుంబంలో అర్హులైన వారికి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 17 కోట్లతో కొలనుపాక బ్రిడ్జి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నామని, జైన దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.  మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు రాష్ట్రంలో 40 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం కింద ఐదు లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచి అండగా ఉన్నామని తెలిపారు.  చెప్పిన పనులే కాకుండా, చెప్పని పనులు కూడా చేస్తున్నామని అన్నారు. చీకటిమామిడి - వడపర్తి,  నాగినేనిపళ్లి - అనంతారం,  మర్యాల- చీకటిమామిడి రోడ్ల పనులు వారం రోజుల్లో టెండర్ పిలిచి పనులు చేపడతామని అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ,  మార్చిలో గ్రూప్ -2 నిర్వహిస్తామని,  ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ విప్,  ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ హాజీపూర్ లో బ్రిడ్జి నిర్మాణంతో దూరాభారం తగ్గుతుందని, బ్రిడ్జి శాంక్షన్ చేసిన మంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ప్రజా ప్రతినిధులు,  అధికారులు పాల్గొన్నారు.