మైనర్ గిరిజన బాలికపై నలుగురి లైంగిక దాడి
![మైనర్ గిరిజన బాలికపై నలుగురి లైంగిక దాడి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642d855c265cc.jpg)
- అబార్షన్ కోసం మాత్రలు
- గర్భస్రావం అనంతరం పిండం పూడ్చివేత
ముద్ర ప్రతినిధి, నిర్మల్: అభం శుభం తెలియని మైనర్ గిరిజన బాలికపై గత 8 మాసాలుగా నలుగురు యువకులు అఘాయిత్యం జరిపి గర్భవతి కావడంతో అబార్షన్ కు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల గ్రామంలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిర్మల్ డి ఎస్పీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన అందించిన వివరాల ప్రకారం కొలాం గిరిజన తెగకు చెందిన మైనర్ బాలిక గతంలో మొక్కజొన్న చేలల్లో పనికి వెళ్ళే సందర్భంలో తులసిపేట్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఎవరికీ చెప్పవద్దని బెదిరించారని తెలిపారు.
ఆ తర్వాత తరచూ వారు ఆమెపై లైంగిక దాడులు కొనసాగిస్తుండడంతో బాలిక గర్భం దాల్చిందని ఆయన అన్నారు. అయితే ఈ సంగతి తెలియని బాలిక రోజూ పనులకు వెళ్లి వచ్చేదన్నారు. కాగా నెలలు నిండు తుండడం తో విషయం తెలిసిన యువకులు గర్భస్రావం కోసం మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఈ యత్నంలో బాలిక నొప్పులు పడుతూ మృత పిండానికి జన్మనిచ్చిందని వివరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాలిక తల్లిదండ్రులు పిండాన్ని పూడ్చిపెట్టిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన వివరించారు.